పేదలకి ఇళ్ల స్థలాల కేటాయింపు  వ్యవహారంలో అమరావతి రైతులు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ మీద సుప్రీం కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది.

రైతులు కోరినట్టు స్థలాల పంపిణీ మీద స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూనే, ఆ స్థలాలపై లబ్ధిదారులకి తుది తీర్పు వచ్చేవరకు ఎటువంటి హక్కులు ఉండవని తీర్పు ఇచ్చింది.

అంతకుముందు, ఏపి హైకోర్టు కూడా సుప్రీం తుది తీర్పునకు లోబడి పంపిణీ జరగొచ్చిన చెప్పింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకి సుప్రీం కోర్టు కొన్ని సవరణలు చేసింది.

 కోర్టులో కేసు విచారణ పెండింగులో ఉన్న కారణంగా తుది తీర్పుకి లోబడి లబ్ధిదారులకు హక్కు ఉంటుంది అని ఇళ్ల పట్టాల్లోనే పేర్కొనాలని రెవెన్యూ అధికారుల్ని  సుప్రీంకోర్టు ఆదేశించింది.

తుది తీర్పు వచ్చే వరకు లబ్ధిదారులకు ఆ స్థలాలపై ఎటువంటి హక్కులు ఉండవని  పట్టాలోనే రాయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఈ ఉత్తర్వులు అటు అధికార పార్టీకి, ఇటు అమరావతి రైతులకి కొంత ఊరటనిచ్చాయి. జగన్ కి తన పంతం నెగ్గించుకోటానికి సుప్రీం ఉత్తర్వులు వెసులుబాటు కల్పించాయి. అదే సమయంలో అమరావతి భూములపై వెంటనే థర్డ్ పార్టీ హక్కులు కల్పించకపోవడం రైతులకి కొంత ఉపశమనం.

ఏదేమైనా, ప్రభుత్వం దగ్గర ఉండే అనంతమైన వనరుల్ని దుర్వినియోగం చేస్తున్న జగన్ ని ఎదుర్కొవటం అన్నీ కోల్పోయిన అమరావతి రైతులకి రోజురోజుకి కష్టం మారుతోంది. అయినా వారు తమ  పోరాటాన్ని ఆపడం లేదు. చరిత్రలో ఇలాంటి పోరాటాలు అరుదుగా జరుగుతాయి.