చిరంజీవి ఈ మధ్య చేసిన కామెంట్లు జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించినవేనని భావిస్తూ, వైసిపి నాయకులు కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చారు. అబ్బే నేను అలా అనలేదని చిరంజీవి తరఫున తర్వాత వివరణలు వచ్చినా, వైసిపి వాళ్లు పట్టించుకోలేదు.

ఈ నేపధ్యంలోనే చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా టికెట్ రేట్ల పెంపు కోసం పెట్టుకున్న అప్లికేషన్ ని జగన్ ప్రభుత్వం తిరస్కరించిందని వార్తలు వచ్చాయి. దీని మీద ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సినిమా నిర్మాణానికి వంద కోట్ల ఖర్చు దాటినట్టు తగిన పత్రాలని జతచేసి నిర్మాతలు పంపాలని, భోళాశంకర్ సినిమాకి సంబంధించి ఇంతవరకు తమకి ఈ పత్రాలు అందలేదని ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. 

అయినా, ప్రభుత్వం మీద నిందారోపణలు చేస్తున్నారని ఈ వివరణలో పేర్కొన్నారు.

పూర్తి వివరణ ఇదీ:

భోళా శంకర్ సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించి వివిధ మీడియా సంస్థల్లో, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై వాస్తవాలు.

1. హీరో, హీరోయిన్, డైరెక్టర్ పారితోషికాలు కాకుండా సినిమా నిర్మాణ ఖర్చు ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కలిపి రూ.100 కోట్లు దాటితే ప్రత్యేక రేట్లను అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 11, 2022న మెమో జారీచేసింది. దీని ప్రకారం నియమనిబంధనలను పాటించిన పలు నిర్మాణ సంస్థలు, నిర్మాతలకు ప్రత్యేక టిక్కెట్ రేట్లను వర్తింపు చేసింది.

2. తాము నిర్మించిన భోళా శంకర్ సినిమా టిక్కెట్ రేట్ల పెంపునకు సంబంధించి నిర్మాణ సంస్థ అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ జులై 30, 2023న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – APSFTVTDCకి అర్జీ పంపింది. 

3. ఈ అర్జీని పరిశీలించిన APSFTVTDC, జీవో నంబర్ 2 రూపంలో ప్రత్యేక టికెట్ రేట్లకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో నియమ నిబంధనలను ప్రకారం, అనుసరించాల్సిన పద్ధతిని, సమర్పించాల్సిన సాధారణ పత్రాల జాబితాను, అందుకు సంబంధించిన వివరాలను జతచేస్తూ ఆగస్టు 2, 2023న లేఖద్వారా తెలిజేయడమైంది. కాని సంబంధిత పత్రాలను, డాక్యుమెంట్లను ఇప్పటివరకూ సమర్పించలేదు.

4. నిబంధనలు ప్రకారం సెన్సార్ అయ్యాక సినిమా నిడివిలో కనీసం 20 శాతం ఆంధ్రప్రదేశ్ లో చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉంది. వైజాగ్ పోర్టు సహా, అరుకు ప్రాంతాల్లో 25 రోజులపాటు చిత్రీకరణ జరిపామని నిర్మాణ సంస్థ తెలిపింది. దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను జతచేయమని కూడా ఏపీఎస్ఎఫ్ఎవీడీసీ కోరింది. అవికూడా ఇప్పటివరకూ సమర్పించలేదు.

5. చిత్రనిర్మాణం పూర్తైన తర్వాత సినిమా విడుదలకు ముందే నిర్మాత లేదా నిర్మాణ సంస్థ సినిమాకోసం చేసిన ఖర్చుపై ఒక అఫిడవిట్ సమర్పించాల్సి ఉంది. దీన్ని ఛార్జెట్ అక్కౌంట్ సర్టిఫై చేయాల్సి ఉంటుంది. అలాగే సినిమా నిర్మాణానికి సంబంధించి చేసిన చెల్లింపులకు సంబంధించి జీఎస్టీ లేదా ట్యాక్స్ రిటర్న్స్, అడ్వాన్స్ చెల్లింపులకు సంబంధించిన ఇన్వాయిస్లు, బ్యాంకు స్టేట్మెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. కాని, వీటిని ఇప్పటివరకూ ఇవ్వలేదు.

6. దీంతోపాటు ప్రత్యేక టిక్కెట్ ధరలకు సంబంధించిన నిబంధనలు ప్రకారం- ఏ వ్యాపార సంస్థైనా తన కార్యకలాపాల్లో భాగంగా నిర్వహించే 12 రకాల సాధారణ పత్రాలను జతచేయమని కోరడం జరిగింది. ఇప్పటివరకూ వీటికి సంబంధించిన డాక్యుమెంట్లను ఏవీ కూడా చేరలేదు.

7. వాస్తవాలు ఇలా ఉండగా ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరం.

8. గతంలో ఆచార్య, వాల్తేరు వీరయ్య లాంటి రెండు సినిమాలను నిర్మించిన నిర్మాణ సంస్థలు, నిర్మాతలు నిబంధనలు ప్రకారం డాక్యుమెంట్లు, పత్రాలను జతచేసి ప్రత్యేక టిక్కెట్లు రేట్లు పొందిన విషయాన్ని గుర్తుచేస్తున్నాం.