Admin

జగన్ జమానాలో ఎలక్షన్ కమిషనర్ కి కూడా ఓటు హక్కు ఉండదు.  

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఓటు హక్కు కల్పించటానికి జగన్ ప్రభుత్వం నిరాకరించింది. రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పనిచేస్తున్నప్పుడు తన స్వగ్రామం దుగ్గిరాలలో తనకు ఓటు హక్కు కల్పించాలని దరఖాస్తు చేసుకున్నారు.

ఐఏఎస్ అధికారి అయిన ఆయనకి అంతకుముందు హైదరాబాదులో ఓటు హక్కు ఉంది. రిటైర్ మెంట్ దశలో తన ఓటుని అక్కడ నుంచి ఏపికి మార్చుకోవాలని ఆయన కోరుకున్నారు.మనదేశంలో ఎవరైనా ఎక్కడ స్థిరపడితే అక్కడ ఓటుని రిజిస్టర్ చేసుకునే హక్కు ఉంటుంది.

అయితే జగన్ ప్రభుత్వం ఆయన దరఖాస్తుని తిరస్కరించింది. దాంతో ఆయన ఏపి హైకోర్టుని ఆశ్రయించారు. మరోసారి దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు ఆయనకి జులై 13న సూచించింది. ఈ మేరకు తాజాగా రమేష్ కుమార్ మరోసారి అన్ని పత్రాలతో పాటు దుగ్గిరాలలో ఎన్నికల అధికారికి తన దరఖాస్తుని ఇచ్చారు.

ఇంతకీ గతంలో ఏ ప్రాతిపదికన రమేష్ కుమార్ కి జగన్ ప్రభుత్వం ఓటు హక్కుని నిరాకరించింది? ఆయన దుగ్గిరాలలో సాధారణ నివాసి కాదని (not ordinarily residnet) చెప్పి నిరాకరించింది. సాధారణ నివాసి అని చెప్పడానికి జగన్ ప్రభుత్వం నిర్వచనం ఏంటో తెలియదు. ఎందుకంటే, దుగ్గిరాల నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వగ్రామం. ఆయనకి అక్కడ ఇల్లు ఉంది. ఆయన తల్లి అక్కడే ఉంటున్నారు. అయినా సాధారణ నివాసి కాదు అంటూ జగన్ అడ్డం పడ్డాడు.

ఈ లెక్కన ముఖ్యమంత్రి జగన్ కూడా పులివెందుల సాధారణ నివాసి కాదు. ఆయన గతంలో బెంగుళూరులో, తర్వాత హైదరాబాద్ లో, అటు తర్వాత తాడేపల్లిలో ఉంటున్నాడు.  భవిష్యత్తులో విశాఖ అంటున్నాడు కాబట్టి అక్కడికి మకాం మార్చవచ్చు. అయినా ఆయన ఓటు పులివెందులలోనే ఉంది.

ఆయనకే కాదు. లక్షలాది మందికి ఇదే విధంగా ఉంది. ఎందుకంటే, ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో ఎక్కడెక్కడో ఉండవచ్చు. కాని ఏదో ఒక చోట ఓటుని రిజిస్టర్ చేసుకునే హక్కు అందరికీ ఉంది.

అయినా, కావాలని జగన్ ప్రభుత్వం ఈ అడ్డగోలు చర్యకి పూనుకుంది. ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన వ్యక్తికే ఈ పరిస్థితి ఎదురైతే ఆంధ్రప్రదేశ్ లో ఇక సాధారణ పౌరుల పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.