శ్రీకాంత్ చింత

పరిటాల రవి గూర్చి ఈ తరానికి తెల్సింది ఎంత అంటే పర్వర్టెడ్ రామ్ గోపాల్ వర్మ తీసిన రక్తచరిత్ర రెండు భాగాలంత. ఇంకాస్త ముందుకు వెళ్తే మోహన్ బాబు తీసిన శ్రీరాములయ్య అంత.

ఇప్పుడు ఇది రాయడానికి కారణం ఏమిటి అంటే పరిటాలని గత 15 ఏళ్లుగా కులం దృష్టిలో చూస్తూ మోస్తున్న ఒక కులం యువకుల కోసం. అలాగే అతను ఆ కులం వాడు కాబట్టి అతడిని అతడి పోరాటాలపై అవగాహన లేక గుడ్డిగా ద్వేషిస్తోన్న మిగతా వర్గాల కోసం. ముఖ్యంగా అతడిని కమ్మ కులస్తుడైన ఏకైక కారణంతో అభిమానిస్తోన్న లేక ద్వేషిస్తోన్న వర్గాల కోసం.

నిజానికి పరిటాల కుటుంబంలో అతని తండ్రి పరిటాల రాములు మరియు అతని సోదరుడు పరిటాల హరి పోరాడింది అక్కడి ఫ్యూడల్ శక్తుల మీద.  తరతరాలుగా ఆ ప్రాంతంలో ఫ్యూడల్ శక్తులు పేదలపై చేస్తోన్న ఆధిపత్యాన్ని ప్రశ్నించి , తమకి ఉన్న పొలాలని పేదలకి, బడుగు బలహీన వర్గాలకి దానం చేసి అదే పోరాటంలో రాములయ్య చనిపోయారు. తండ్రి మరణంతో పరిటాల హరి కూడా అదే ఫ్యూడల్ శక్తులతో పోరాటంలో భాగంగా మరణించాడు.

ఇక్కడ పరిటాల రాములయ్య గాని, పరిటాల హరి గాని పొరాడింది కమ్మ కులస్తులు కోసం కాదు. అక్కడ ఉండే బోయ, కురుమ, ఈడిగ కులాల కోసం, బిసిల కోసం, దళితుల కోసం.

అలా వారిద్దరిని కోల్పోయిన పరిటాల రవి కూడా అప్పటికే రాజకీయంగా బలంగా ఉన్న ఫ్యూడల్ శక్తులని ఎదుర్కోవడానికి అప్పటికే తన కులం వాడు స్ధాపించిన పార్టీ ఉన్నా అందులో చేరలేదు. వామపక్ష ఎర్ర శక్తులతో జేరి అజ్ఞాతంలో ఉంటూ పోరాడాడు. తరువాత నక్సల్స్ పై నిషేధం ఎత్తివేతలో భాగంగా జనజీవన స్రవంతిలో కలిసి ఆ ఫ్యూడల్ భూస్వామ్య శక్తులని ఎదుర్కోవడానికి రాజకీయ పార్టీ అండ అవసరమై తెదేపా పార్టీలో జెరాడు.

అసలు పరిటాల ముఖ్య అనుచరులైన పోతుల సురేష్, చమన్, భాషా, తగరకుంట ప్రభాకర్, మధుసూదన్ రెడ్డి వంటి వారు విభిన్న కులాలకు చెందిన వారు. ఇక రాజకీయంగా పరిటాల ప్రోత్సహించి నిమ్మల కృష్ణప్ప, బికె పార్థసారథి, కేతిరెడ్డి, కాలువ శ్రీనివాసులు, సిసి రంగనాయకులు వంటి ఇతర కులాలవారినే ప్రోత్సహించారు.

అదే సమయంలో కమ్మ రాజకీయ నాయకులైన పయ్యావుల, ప్రభాకర చౌదరి, గోనుగుంట్ల వంటి వారిని ఓడించారు.. ఉన్నవ హనుమతురావు గారికైతే టికెట్ కూడా దక్కనివ్వలేదు.

రాజకీయంగా నల్లమాడలో పల్లె రఘనాధ రెడ్డిని తీసుకొచ్చి గెలిపించారు, గోరంట్లలో బిసి నిమ్మల కిష్టప్పను గెలిపించి మంత్రిని కూడా చేసారు, ధర్మవరంలో కమ్మ అభ్యర్థి విజయకుమార్ ను ఓడించి కేతిరెడ్డిని గెలిపించారు, అనంతపురంలో ప్రభాకర్ చౌదరిని ఓడించి నారాయణ రెడ్డికి సహకరించారు, ఉరవకొండలో కమ్మ అభ్యర్థి కేశవ్ ను ఓడించి రెడ్డి అభ్యర్థి గెలవడానిక సహకరించారు, హిందూపురంలో కూడా సి సి వెంకటరాముడు వంటి కమ్మేతర అభ్యర్థికి మద్దతు ఇచ్చారు.

స్వకులస్తులైన వరదాపురం సూరి, వెలకుంట రాజన్న వంటి వారిని చివరి రోజుల్లో మనస్పర్ధలతో దూరం పెట్టారు. ఇంకా పరిటాల చేసిన కుల రాజకీయం ఏమిటి? అతను రాజకీయ ఆధిపత్యం చూపాడు తప్ప కులాధిపత్యం చూపలేదు. అలాంటి పరిటాలని కమ్మ నాయకుడిగా చూపుకున్నామా? జరిగిన లోపం ఎక్కడ ఉందో చూద్దామా?

ఒక దశ వరకు పరిటాల కమ్మ కులస్తుడు అని కమ్మవారిలోనే చాలా మందికి తెలియదు. అలాంటి పరిటాల రవి రాజకీయంగా శక్తిగా మారాక కొన్ని అనూహ్య సంఘటనల వల్ల, గతం తాలూకు పోరాటాల వల్ల, పగల వల్ల, బాంబు పేలుళ్ల వంటి సంఘటనలు వల్ల రాష్ట్రం అంతటా తెలిసింది. మోహన్ బాబు శ్రీరాములయ్య సినిమా తీయడంతో అదనపు బరువు పరిటాల మీద పడింది. పరిటాల కులం అందరికి తెలిసింది 97 తరువాతే.  పరిటాలని కులం దృష్టిలో చూడడం, ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే చూడడం అప్పుడే మొదలయ్యింది. ఒక తెలుగు అగ్రహీరోతో జరిగిందని ప్రచారంలోకి వచ్చిన ఘటన నాటి నుండి పరిటాలని ఒక కులం పార్టీ నాయకుడిగా చూడడం మొదలయ్యింది.

అప్పట్లో ఏ తెలుగు పత్రికలలో రాని విషయాన్ని హైదరాబాద్ లో ప్రచురించబడే కాంగ్రెస్ పార్టీ ఎంపీకి చెందిన ఆంగ్ల పత్రిక ఆ సంఘటనని మసాలా జోడించి, రెండు కులాల మధ్య విబేధాలు సృష్టించి మరో రాజకీయ పార్టీకి లాభం కలిగేలా పదే పదే ప్రచురించింది.

అప్పటికే సినీ, రాజకీయ రంగాలలో విబేధాలు ఉన్న ఆ రెండు కులాల మధ్య మరింత దూరం పెంచి, ఒక పార్టీకి రాజకీయంగా లాభం కలిగెేలా కథనాలు ప్రచురించింది. ఈ సంఘటన తరువాత ఆ రెండు కులాల మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. ఆయా కులాల యువత కూడా దీనిని తమ ఆధిపత్యం ప్రదర్శించడానికి, పనికిమాలిన సినిమా ఫాన్స్ వార్ కోసం కుల కోణంలో ఆలోచించాయి తప్ప, ఇందులో ఆ ఆంగ్ల పత్రిక పన్నిన రాజకీయ కుట్ర కోణాన్ని గమనించలేదు.

అప్పటి నుండి పరిటాలని కమ్మ యువత ఓన్ చేసుకుంది. మిగతా కులాలు పరిటాలని కులం దృష్టితో చూడడం ప్రారంభించాయి. ఇదే క్రమంలో పరిటాల ఎదుర్కొన్నది పోరాడినది ఫ్యూడల్ శక్తులని మరిచి,  కమ్మ కాపు, చిరంజివి బాలయ్య మధ్య ఫాన్స్ వార్ కోసం వాడుకోబడ్డాడు. అతను, అతని కుటుంబం పోరాడింది బడుగు బలహీన దళిత వర్గాల కోసం అనే విషయం వెనక్కి పోయి, మిగతా చిల్లర విషయాలు ముందుకు నెట్టబడ్డాయ్. ఆ ఆంగ్ల పత్రిక రాతల వెనక రాజకీయ కోణాన్ని గుర్తించలేకపోయారు.

ఫ్యూడల్ శక్తులపై పోరాడిన యోధుడిపైన కుల వర్గ ముద్ర వేశారు.  సామ్యవాది అయిన పరిటాలని తమ కులం వాడే అని ఒక కులం ఎక్కువగా ఓన్ చేసుకొని ఉండవచ్చు. కాని అతని జీవితాన్ని అతని తండ్రి కాలం నుండి నిశితంగా పరిశీలిస్తే  అంతు లేని పోరాట స్ఫూర్తి  పరిటాల అని అర్దం అవుతుంది. ఇకనైనా పేదల కోసం, బడుగు బలహీన వర్గాలు కోసం నిలిచిన కుటుంబాన్ని, ముఖ్యంగా పరిటాల రవిని దయచేసి ఒక కులానికి పరిమితం చేయకండి.