తెలుగుదేశం పార్టీలో చేరేందుకు గతంలో వైసిపిలో ఉన్న నెల్లూరు రెడ్డు రెడీ అవుతున్నారు. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, వైసిపి టికెట్ మీద వెంకటగిరి నియోజకవర్గం నుంచి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి త్వరలోనే టిడిపిలో లాంఛనంగా చేరబోతున్నారు. ఆయనతో పాటు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి కూడా త్వరలో టిడిపిలో చేరబోతున్నానని తాజాగా ప్రకటించారు.

త్వరలో నెల్లూరులో ప్రవేశించనున్న నారా లోకేష్ యువగళం పాదయాత్రని విజయవంతం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకుంటానని రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆ పార్టీలో ఇంకా చేరకపోయినా, లోకేష్ పాదయాత్రని నెల్లూరులో భారీఎత్తున నిర్వహిస్తామని వైసిపి నుంచి సస్పెండైన మరొక నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి కూడా చెబుతున్నారు. జిల్లాలో లోకేష్ పాదయాత్ర సందర్భంలోనే టిడిపిలో తాను లాంఛనంగా చేరతానని కూడా శ్రీధరరెడ్డి చెప్పారు.

మేకపాటి శనివారం బద్వేలులో పాదయాత్ర చేస్తున్న లోకేష్ ని కలిసి, ఆయనతో పాట నడిచారు. టిడిపి టికెట్ ఇస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తానని, ఒకవేళ ఇవ్వలేకపోయినా ఆ పార్టీ విజయం కోసం పనిచేస్తానని మేకపాటి ఈ సందర్భంగా చెప్పారు.

మొత్తానికి లోకేష్ నెల్లూరు పాదయాత్రలో జరగబోయే చేరికలు వైసిపికి గుబులు పుట్టిస్తున్నాయి.