Admin

అమరావతిలో పేదలకి ఇళ్ల నిర్మాణం నాటకం అంతా నారా లోకేష్ ని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో జరుగుతున్నదేనని నరసాపురం ఎంపీ కె. రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎన్నికల నిధుల పథకమని అన్నారు. కోడికత్తి కేసు, వివేకా హత్య కేసుల్లో జగన్ అండ్ కో ఆడుతున్న నాటకం జనానికి తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. బుధవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో కట్టిన ఇళ్లు రెండు వేలే

ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద దేశంలోనే అతి తక్కువ గృహ నిర్మాణాలను చేపట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి 1,80,715 ఇళ్లు మంజూరయితే, కేవలం 2,167 ఇళ్లని మాత్రమే నిర్మించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ. 1,80,000 ఆర్థిక సహాయాన్ని చేస్తుంది. అయినా దేశంలోనే అతి తక్కువ ఇళ్ల నిర్మాణం చేపట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని రఘురామ చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల కంటే అధ్యాన్న పరిస్థితుల్లో ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రం ఉందన్నారు.

“మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఆర్ 5 జోన్ లో 50,790 ఇళ్ల నిర్మాణాన్ని మాత్రం ఆగమేఘాల మీద చేపడతామని జమోరె (జగన్ మోహన్ రెడ్డి) చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అమరావతి పరిధిలోని ఇళ్లని శరవేగంగా నిర్మిస్తే, రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల లబ్ధిదారులు ఊరుకుంటారా, పాదరక్షలు పుచ్చుకొని కొట్టరా,” అని వ్యంగ్యంగా ప్రశ్నించారు.

రాష్ట్రంలో మూడు లక్షల 50 వేల మందికి ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఇళ్లు మీరు కట్టుకుంటారా, మమ్మల్ని కట్టించమంటారా అని ప్రభుత్వ పెద్దలు లబ్ధిదారులను ప్రశ్నించారు. ప్రభుత్వమే తమకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలని లబ్ధిదారులు కోరగా, ఇళ్లు నిర్మాణాన్ని చేయించి ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఇళ్లు కట్టుకుంటారా, ఇంటి స్థలం పట్టాను క్యాన్సిల్ చేయమంటారా అని బెదిరిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో శరవేగంగా ఇళ్ల నిర్మాణం ద్వారా, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఓడించాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

పద్మవ్యూహంలో అభిమన్యుడిని ఒంటరి చేసి ఓడించినట్లుగా లోకేష్ ని ఓడించాలని అనుకుంటున్నారు. కానీ పద్మవ్యూహం కుట్రలను లోకేష్ ఛేదించగలడని అన్నారు.

మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్లు కట్టడానికి ముందే, మా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని స్థలాలను పొందిన లబ్ధిదారులు తమ తమ నియోజకవర్గ ఎమ్మెల్యేలను కోరాలి. మంగళగిరిలో మాత్రం ఇళ్ల నిర్మాణానికయ్యే నిధులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందట. రేపు కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే, ప్రజా సొమ్ము దుర్వినియోగమయిన ఫర్వాలేదా అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

పర్యావరణ అనుమతి లేకుండానే ప్రాజెక్టుకు రుణం ఎలా ఇచ్చారు?

రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లభించలేదు. అయినా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రుణం ఎలా మంజూరు చేశారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అపర భగీరధుడిలా మొదలు పెట్టానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం అవసరమైన పత్రాలను మాత్రం సమర్పించలేదు. ఈ విషయాన్ని పార్లమెంటు వేదికగా కేంద్రమంత్రి అశ్విని చౌబే చెప్పారు. పంపులు, మోటర్ల పేరిట పర్యావరణ శాఖ అనుమతులు లభించక ముందే రుణాన్ని ఎత్తారు.

ఎన్నికల నిధుల కోసమే ప్రాజెక్టు?

రాష్ట్ర ప్రభుత్వం దొంగ పత్రాలను సమర్పించి, రుణాన్ని పొందుతుందని సదరు సంస్థ కూడా భావించి ఉండదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను దక్కించుకున్న మెఘా ఇంజనీరింగ్ సంస్థకు ఇటీవల రూ.700 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసిన విషయం తెలిసింది. ఇప్పుడు గుట్టు రట్టయింది. ప్రాజెక్టు పేరిట రుణాన్ని పొందారు కానీ ప్రాజెక్టు పనులు అడుగు కూడా ముందుకు పడలేదు.

“ప్రభుత్వ పెద్దలకు కావలసింది రుణం, రుణం ద్వారా వచ్చే ధనం, అది రానున్న ఎన్నికలకు ఇంధనం కాబోలు,” అంటూ రఘురామకృష్ణంరాజు అపహాస్యం చేశారు.

ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ రాకుండా చేశారు          

అలాగే జల్ మిషన్ పథకంలో భాగంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీటి సరఫరా చేసేందుకు ప్రతి ఏటా 50 వేల కోట్ల రూపాయలను కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసింది. “ఈ విషయాన్ని కేంద్ర మంత్రి షెకావత్ స్వయంగా నాతోనే చెప్పారు. ఏటా పదిహేను వేల కోట్ల రూపాయలను సాగునీటి పథకం అమలు కోసం రాష్ట్రం కేటాయించి ఉంటే, ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి నల్లాల ద్వారా నీటి సరఫరా చేసే వెసులుబాటు లభించి ఉండేది. ఈ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులను మంజూరు చేస్తే, నలభై శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీటి సరఫరా కోసం గతంలో ముఖ్యమంత్రితో సఖ్యతగా ఉన్నప్పుడు నేను ఎన్నో ప్రణాళికలను సిద్ధం చేశాను. ఇదే విషయమై అధికారులతో చర్చించాను. కానీ ప్రభుత్వ పెద్దలకు కన్నాలు వేయడం తప్ప, అభివృద్ధి కార్యక్రమాల అమలు గురించి పెద్దగా ఆలోచించలేదని ఆరోపించారు.

ఆంగ్ల దినపత్రికల్లో రాయించుకుంటున్నారు

ప్రతి పథకం అమల్లో రాష్ట్ర ప్రభుత్వం అగ్రస్థానంలో ఉందని డబ్బులు ఇస్తున్నందుకు ఒక ఆంగ్ల దినపత్రిక రాస్తున్నప్పటికీ, అన్ని పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం అధమ స్థానంలో ఉంది. పోలవరం ప్రాజెక్టును రివర్స్ టెండరింగ్ అమలు ద్వారా సర్వనాశనం చేశారు. రాష్ట్ర ప్రజలకు సాగునీరు, తాగునీరు లేకుండా చేశారు. వెలిగొండ ప్రాజెక్టుకు మోక్షం లభించేది ఎప్పుడో! గృహ నిర్మాణ రంగంలో, సాగు, తాగు నీటి రంగంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రజలపై అమరావతి అభివృద్ధి పేరిట 4 రూపాయల సెస్సు వసూలు చేస్తున్నారు. ఈ విషయాన్ని గత పార్లమెంట్ సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూరే చెప్పారు. ఇప్పటివరకు అమరావతి అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది ఎంత? ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి అభివృద్ధి కోసం వేసిన రోడ్లను కూడా ఇసుక, కంకరను వేరు చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అమ్ముకున్నారు.

“గతంలో దారి దోపిడీల గురించి విన్నాము. కానీ ఇప్పుడు దారుల దోపిడీని చూస్తున్నాము,” అని వ్యాఖ్యానించారు.

పెట్రోల్ మీద సెస్సు వసూళ్లలో రాష్ట్ర ప్రభుత్వమే అగ్రస్థానంలో ఉంది. అలాగే రాష్ట్ర ప్రజల నుంచి ఒక రూపాయ చొప్పున రోడ్డు సెస్సును వసూలు చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్లు బాగా లేవు. 

కోడి కత్తి డ్రామా సంగతి తెలిసిపోయింది

గత ఎన్నికల్లో తమ పార్టీ గెలుపుకు కారణమైన రెండు సంఘటనలే ఈసారి తమ పార్టీ పెను ఓటమికి నాంది కాబోతున్నాయన్నది స్పష్టమవుతోందని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. గత ఎన్నికల్లో మా పార్టీ గెలుపు దోహదపడిన రెండు సంఘటనల్లో ఒకటి కోడి కత్తి డ్రామా. అభిమాని చేత భుజం మీద లైట్ గా గాయం చేయించుకొని జగన్మోహన్ రెడ్డి చిరునవ్వులు చిందిస్తూ ఫ్లైట్ ఎక్కారు. కానీ హైదరాబాదుకు చేరుకునే సరికి స్ట్రెచర్ పై పడుకొని ఆసుపత్రిలోకి వెళ్లి చికిత్స పొందారు . ఈ కేసును విచారించిన ఎన్ఐఏ, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా, జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యేందుకు నిరాకరించారు. ఈ సంఘటన వెనుక కుట్ర ఉందని, ఆ దిశగా విచారణ చేపట్టాలని కోరినప్పటికీ, ఎన్ఐఏ నిరాకరించి ఆ పప్పులేమి ఉడకవని తేల్చి చెప్పింది. తనని ఎవరో హత్యచేయాలనుకున్నారని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని చేశారు. కానీ ప్రభుత్వ పెద్దల ఎత్తు గడ చిత్తయింది. ఈ విషయాన్ని రానున్న ఎన్నికల్లోనూ వాడుకోవాలనుకున్న నా ప్రస్తుత పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లు అయిందని ఎద్దేవా చేశారు.

గొడ్డలి పోటులో తప్పించుకోలేరు

“గత ఎన్నికల్లో మా పార్టీ విజయానికి దోహద పడిన మరొక సంఘటన గొడ్డలి పోటు. వైఎస్ వివేకానంద రెడ్డిని మా పార్టీ నాయకులే వేయించారు. వైయస్ శివశంకర్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిలు మా పార్టీకి చెందిన నాయకులే. ఒకరేమో పార్టీ ప్రధాన కార్యదర్శి కాగా, మరొకరు పార్టీ ఎంపీ. మా పార్టీ నాయకులే హత్య చేయించి, ‘నారా సుర రక్త చరిత్ర’ అని సాక్షి దినపత్రిక ద్వారా తప్పుడు ప్రచారాన్ని చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారు. సిబిఐ తన చార్జిషీట్ పగడ్బందీగా దాఖలు చేయడం తో ఇప్పుడు కథ అడ్డం తిరిగింది.

సందింటివారు సందింటివారు చంపుకున్నారని సిబిఐ చెప్పేసింది. వాళ్లు వాళ్లు చంపుకుంటే మీకెందుకన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి ఉన్నది.

నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుగా గత సంవత్సరన్నర కాలం నుంచి వైఎస్ వివేకానంద రెడ్డికి ఎంతోమంది స్త్రీలతో సంబంధాన్ని అంట గట్టింది సాక్షి దినపత్రిక, మా పార్టీ నాయకులు కాదా?! వైయస్ వివేకానంద రెడ్డిని ఆస్తి కోసమే హత్య చేశారని, ఆయనకు రెండవ భార్య ఉన్నదని ప్రచారం చేశారు. వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారంతా భార్యలని అంటే, మన నాయకులకు ఎంతమంది నాయనమ్మలు, ఎంతమంది అమ్మమ్మలు, వారి పిల్లలకు ఎంతమంది పిన్నిలు ఉండేవారు. సంబంధం ఉన్న ప్రతి స్త్రీ భార్య కాదని మహాసేన రాజేష్ చక్కగా వివరించారు. వైఎస్ వివేకానంద రెడ్డి పేరిట ఉన్న ఆస్తి స్వల్పం. ఆయన పేరుట ఉన్న ఆస్తి అంతా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఉన్నది. మరికొంత ఆస్తి ఆయన ఏకైక కుమార్తె అయిన సునీతా రెడ్డి పేరిట, ఈ హత్యకు ముందే ఆయన రాశారు. ఆస్తి పత్రాలను పట్టుకు పోయారని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. ఆస్తి పత్రాలు ఎవరైనా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరకు పట్టుకు వచ్చి ఇచ్చారా? 8 నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు చేసింది. ఈ విషయాన్ని అప్పుడు ఎవరైనా చెప్పారా? ఇంకా ప్రజల్ని అమాయకులుగా భావించి మభ్యపెట్టాలనుకోవడం ఆశ్చర్యకరం.

సజ్జలలో కనిపించిన భయం

అయినా ఈ విషయాలు మాట్లాడడానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు, ఏ హోదాలో మాట్లాడుతున్నారని రఘురామ ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారుగా మాట్లాడుతున్నారా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో మాట్లాడుతున్నారా? అని  ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి సిబిఐ పై అభియోగాలను మోపడం ఆశ్చర్యకరంగా ఉంది. కర్నూల్లో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా ఉండడానికి ఆడిందంతా ఉత్తుత్తి డ్రామానేనని అందరికీ తెలుసు. సుప్రీంకోర్టులో సునీతా రెడ్డి పిటీషన్ దాఖలు చేస్తే, సిబిఐ కౌంటర్ కూడా దాఖలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి తనపై మోపిన 32 ఆర్థిక నేరాల కేసుల విచారణకు కోర్టుకు హాజరుకానని చెబితే, సిబిఐ నోరు మెదపకుండా ఉంది. దేశ చరిత్రలోనే ఒక వ్యక్తి కేసు విచారణకు కోర్టుకు హాజరుకానుని చెబితే తల ఊపిన ఘనత సిబిఐ కే దక్కుతుంది.

సిబిఐని ఎవరు మేనేజ్ చేశారు?

ఈ విషయంలో సిబిఐ కనీసం అప్పిలుకు కూడా వెళ్లలేదు. అంటే సిబిఐ ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేనేజ్ చేశారా?, జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేశారా? అని రఘురామకృష్ణం రాజు నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి పై ఆర్థిక నేరాల కేసులను డీల్ చేసింది అవినీతి నిరోధక విభాగం అధికారులు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ జరుపుతున్నది నేర విభాగం అధికారులని స్పష్టమవుతుంది. తొలుత వీరిని కూడా మేనేజ్ చేయాలని చూశారు. కానీ తరువాత టఫ్ అని తెలిసి ఏమి చేయాలో పాలు పోని పరిస్థితిలో ఉన్నారు.

సిబిఐ లోని ఒక విభాగం అధికారులు సహకరించిన తరువాత కూడా ఆ సంస్థ పై అభియోగాలను మోపడం అంటే, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థ ఉనికిని ప్రశ్నించడమే అవుతుంది. అది మొదటికే మోసాన్ని తెస్తుందని గ్రహించాలని అన్నారు.

సజ్జల రామకృష్ణారెడ్డి కళ్ళల్లో భయం కనిపించింది. షర్మిల జోలికి వెళ్లలేదు. కేవలం సునీత గురించే మాట్లాడారు. షర్మిల జోలికి వెళితే ఆమె గుబ గుయ్యమనిపిస్తుందని తెలుసు. ఢిల్లీ పెద్దలకు పాదపూజ చేశారు. ఎన్డీఏలో కలుస్తామని చెప్పారు. అయినా పని జరగలేదు. దీనితో సజ్జల కళ్ళల్లో ఏదో జరుగుతుందేమోనని భయం కనిపిస్తోంది. ఆయన మాటల్లోనే కథ అడ్డం తిరిగినట్లు స్పష్టమవుతుంది. సెప్టెంబర్ 11వ తేదీ వరకు అవినాష్ రెడ్డి అరెస్టు ఉండకపోవచ్చు. కానీ ఆ తరువాత ఏమైనా జరగవచ్చు. ఇంత అడ్డంగా దొరికిన తర్వాత కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తీరు చూస్తుంటే, వీళ్లు గొంతు వరకు నీళ్ల లో మునిగినట్లు స్పష్టమవుతోందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సాక్షులుగా ఉన్న వ్యక్తులు ఆత్మహత్య గావించబడడం, ఎలుక కొరికి ఒకరు చనిపోవడం, గాయానికి కుట్లు వేసిన కట్లు కట్టిన ఆసుపత్రి యజమాని కరోనా వల్ల తలలో రక్తస్రావం జరిగి మరణించడం వంటి సంఘటనలు అనుమానానికి తావు తీస్తున్నాయి. వీటన్నింటిపై సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలి. అలాగే పరమేశ్వర్ రెడ్డి హాస్పిటల్ లో ఎందుకు దాక్కున్నారు? పరమేశ్వర్ రెడ్డిని విచారించిన అధికారులు ఆయనకు ఎటువంటి సమస్య లేదని చెప్పినా రుయా ఆసుపత్రిలో మళ్లీ ఎందుకు చికిత్స పొందారు? ఈ విషయాలపై సజ్జల రామకృష్ణారెడ్డి సంసిద్ధత వ్యక్తం చేస్తే , మీడియా డిబేట్ కు తాను సిద్ధమేనని రఘురామకృష్ణంరాజు సవాల్ చేశారు.